1500 మంది దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రం

ABN , First Publish Date - 2022-10-05T06:29:08+05:30 IST

జిల్లాలో 1500 మందికి మించి ఓటర్లు ఉంటే ఆ ప్రాంతంలో అదనంగా మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఆర్వో ఎస్‌.రాజశేఖర్‌ అన్నారు.

1500 మంది దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రం
రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్న డీఆర్వో

వచ్చేనెల 7లోగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలి ఫ పాత ఓటర్ల జాబితాలు చెల్లవు

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 4: జిల్లాలో 1500 మందికి మించి ఓటర్లు ఉంటే ఆ ప్రాంతంలో అదనంగా మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఆర్వో ఎస్‌.రాజశేఖర్‌ అన్నారు. చిత్తూరులోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌హాలులో మంగళవారం ఆయన తహసీల్దార్లు, ఎలక్షన్‌ డీటీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. గతంలోని 57 పోలింగ్‌ కేంద్రాలను పాత భవనాల నుంచి కొత్తవాటికి మార్చామన్నారు. ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలన్నారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు 2017లో నమోదు చేసుకున్న పాత ఓటరు జాబితాలు చెల్లవన్నారు. అర్హులైనవారు తమ పేర్లను  నమోదు చేసుకోవాలన్నారు. 2019 అక్టోబరు 31వతేదీ నాటికి డిగ్రీ పూర్తిచేసిన వారే అర్హులన్నారు. ఓటరు నమోదు ఫారాలన్నీ ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, మున్సిపల్‌ కార్యాలయాలు, సచివాలయాల ద్వారా పొందవచ్చన్నారు. ఉపాధ్యాయ ఎన్నికలకు 2016 నవంబరు 1 నుంచి 2022 అక్టోబరు 31వరకు ఆరేళ్ల వ్యవధిలో కనీసం మూడేళ్లు టీచర్లుగా పనిచేసినవారే ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులన్నారు. వివరాలకు సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. నేతలు సురేంద్ర కుమార్‌ (టీడీపీ), ప్రేమ్‌కుమార్‌ (వైసీపీ), కె.చిట్టిబాబు (బీజేపీ), జ్ఞానరాజు (సీపీఎం), కె.అశోక్‌కుమార్‌ (బీఎస్పీ), మురళి (జనసేన), తహసీల్దార్‌ పద్మజ, ఎలక్షన్‌ డిటి పార్థసారధి, ఎన్నికల విభాగ అధికారి ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-05T06:29:08+05:30 IST