లోన్యా్ప వలలో పడొద్దు
ABN , First Publish Date - 2022-09-24T07:10:17+05:30 IST
లోన్యా్పల వలలో పడి.. ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ప్రజలకు ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు.
బాధితులుంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి జూ ఎస్పీ పరమేశ్వర రెడ్డి
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 23: లోన్యా్పల వలలో పడి.. ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ప్రజలకు ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎటువంటి పత్రాలు లేకుండా, సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా అతి సులభంగా డబ్బు అప్పు ఇస్తున్నారంటేనే అందులో దురుద్దేశం ఉందని గ్రహించాలన్నారు. జిల్లాలో ఎవరైనా లోన్యా్పల బాధితులుంటే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన కొందరు లోన్యా్పల వలలోపడి రూ.14.5 లక్షలు కోల్పోయారని, దీనిపై 11 కేసులు నమోదు చేయడంతోపాటు లోన్యా్పలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలోని రూ.7.5 కోట్లను స్తంభింపజేశామని వివరించారు. బాధితులు నష్టపోయిన మొత్తాన్ని కోర్టులు, బ్యాంకులద్వారా తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అలాగే 41 లోన్యా్పలను ఆన్లైన్ నుంచి తొలగింపజేసినట్టు వెల్లడించారు. వాట్సప్, మెసేజ్, ఈ-మెయిల్ తదితరాల ద్వారా వచ్చే లింక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దన్నారు. బాధితులు స్థానిక పోలీసులను సంప్రదించాలని, లేదంటే 91212 11100 నెంబరుకు ఫోన్చేసి సైబర్ మిత్ర హెల్ప్లైన్కు, 1930కి ఫోన్చేసి నేషనల్ సైబర్ క్రైమ్కు, పోలీసు డయల్ 100కు ఫోన్చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. లోన్యా్పల బారిన ప్రజలు పడకుండా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు ఎస్పీ ప్రకటించారు. ఇందులో భాగంగా వలంటీర్లు, మహిళా పోలీసులను ఉపయోగించుకుని అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. దీనిపై రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అక్కడక్కడా ఫ్లెక్సీలు కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అడ్మిన్ ఏఎస్పీ సుప్రజ, క్రైమ్ ఏఎస్పీ విమలకుమారి, డీఎస్పీలు కాటమరాజు (ట్రాఫిక్), నరసప్ప (వెస్ట్), నాగసుబ్బన్న (ఎస్సీ, ఎస్టీసెల్), సైబర్ ల్యాబ్ సీఐ విక్రం తదితరులు పాల్గొన్నారు.