దిశ యాప్‌ నిర్లక్ష్యంపై డీజీపీ సీరియస్‌

ABN , First Publish Date - 2022-11-23T00:57:13+05:30 IST

దిశ యాప్‌ పట్ల నిర్లక్ష్యం, ఫిర్యాదులపై అలసత్వం.. ఫిర్యాదుదారులతో అసభ్యంగా మాట్లాడిన ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు.

దిశ యాప్‌ నిర్లక్ష్యంపై డీజీపీ సీరియస్‌
ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌

పుంగనూరు, నవంబరు 22: దిశ యాప్‌ పట్ల నిర్లక్ష్యం, ఫిర్యాదులపై అలసత్వం.. ఫిర్యాదుదారులతో అసభ్యంగా మాట్లాడిన ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీంతో సోమల ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ను వీఆర్‌కు పంపగా.. కానిస్టేబుల్‌ మంజునాథరెడ్డి సస్పెండయ్యారు. కాగా, డయల్‌ 100 ఫోన్‌కాల్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సోమల మండలంలోని ఓ మహిళ తన సమస్య పరిష్కరించాలని పోలీసులను ఆశ్రయించారు. దీనికి వారు న్యాయం చేయకపోగా అసభ్యంగా వ్యవహరించడంతో ఆమె దిశయా్‌పలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై డీజీపీ సీరియస్‌ కావడంతో విచారించాలని ఎస్పీని ఆదేశించినట్టు సమాచారం. చిత్తూరు దిశ పోలీసులు విచారించి నివేదించడంతో ఇద్దరిపై వేటుపడటానికి కారణమైనట్లు తెలిసింది. రెండురోజుల క్రితం సోమల ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌, కానిస్టేబుల్‌ మంజునాథరెడ్డిని సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులు భావించగా ఇందులో రాజకీయజోక్యం చోటు చేసుకోవడంతో కొన్ని మార్పులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ను చిత్తూరు వీఆర్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులిచ్చారు. రెండురోజుల క్రితం కానిస్టేబుల్‌ మంజునాథరెడ్డి సోమలలో రిలీవ్‌ అయి చిత్తూరు ఎస్పీ వద్ద వేకన్సీ రిజర్వులో రిపోర్టు చేశాక ఆయన్ను ఎస్పీ రిషాంత్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. కాగా, సోమల ఎస్‌ఐగా లక్ష్మీకాంత్‌ 2011- 13 వరకు పనిచేసి బదిలీ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే మళ్లీ 2019 జూలై 4వతేదీ సోమల ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై పుంగనూరు రూరల్‌ సీఐ మధుసూదన్‌రెడ్డితో మంగళవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడగా... డయల్‌ 100 ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా కానిస్టేబుల్‌ మంజునాథరెడ్డి వ్యవహరించారని ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారని, పర్యవేక్షణలోపంతో ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ను వేకన్సీ రిజర్వుకు పంపారని తెలిపారు.

Updated Date - 2022-11-23T00:57:17+05:30 IST