ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-03T06:01:03+05:30 IST

ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు.

ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు సిటీ, అక్టోబరు2 : ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా జైలులో ఏర్పాటు చేసి ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ఆమర ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఎవరూ ఖైదీలు కావాలని కోరుకోరని, పరిస్థితుల ప్రభావంతో, ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల నేరాలు చేస్తున్నారని అన్నారు. వారిలో మార్పు తీసుకువస్తే బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ప్రశాంతంగా జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఇవి వారి సంక్షేమానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఖైదీలకు మెరుగైన వైద్య సౌకర్యాలు, న్యాయసేవా సంస్థ సహకారం అందిస్తున్నామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జైలులో 150 మంది ఖైదీలు ఉన్నారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జైలు ఆవరణలో నిర్వహించిన వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరచిన ఖైదీలకు జ్ఞాపికలు అందజేశారు. ఆర్డీవో రేణుక, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-03T06:01:03+05:30 IST