ఇదీ కక్ష సాధింపేనా..!
ABN , First Publish Date - 2022-08-16T07:32:28+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు జంగం శివశంకరయ్యతో కలిసి పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ అనుచరులు పుంగనూరులో 120 ఆటోలతో ర్యాలీ చేశారు. దేశనాయకుల ఫొటో కటౌట్లు, జాతీయ పతాకాలతో పట్టణంలో ర్యాలీగా వెళుతూ దేశ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలోనూ పోలీసులు కక్ష సాధింపునకు పాల్పడ్డారన్న విమర్శలు వచ్చాయి.
తనిఖీలంటూ ర్యాలీకి వెళ్లిన ఆటోలకు జరిమానాలు
పుంగనూరు పోలీసుల తీరే వేరు
పుంగనూరు, ఆగస్టు 15: స్వాతంత్య్ర సమరయోధుడు జంగం శివశంకరయ్యతో కలిసి పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ అనుచరులు పుంగనూరులో 120 ఆటోలతో ర్యాలీ చేశారు. దేశనాయకుల ఫొటో కటౌట్లు, జాతీయ పతాకాలతో పట్టణంలో ర్యాలీగా వెళుతూ దేశ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలోనూ పోలీసులు కక్ష సాధింపునకు పాల్పడ్డారన్న విమర్శలు వచ్చాయి. పుంగనూరులో రామచంద్రయాదవ్ ఏ సేవా కార్యక్రమం చేపట్టినా కొంతమంది అధికార పార్టీ నాయకులు పోలీసు, అధికారుల ద్వారా అడ్డుకుంటున్నారు. మే 18న పుంగనూరులో యాదవ్ 150 కంపెనీల ద్వారా మెగా జాబ్మేళా ఏర్పాటు చేయగా అధికారుల ద్వారా కార్యక్రమాన్ని జరగనివ్వని విషయం తెలిసిందే. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో ర్యాలీకి వచ్చిన ఆటోలపై పోలీసులు దృష్టి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు బిజీగా ఉండే పోలీసులు.. ఆటోల తనిఖీలకు దిగారు జాతీయజెండాలతో ఉన్న ఆటోలను నిలిపి రికార్డులు సరిగాలేవంటూ 14 ఆటోలను పోలీసుస్టేషన్లో పెట్టి జరిమానా విధించారు. జరిమానా కడతామని వారంటున్నా సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచుకుని తర్వాత పంపడం విమర్శలకు తావిస్తోంది. అద్దెకు వచ్చిన ఆటోలపై పోలీసులు ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది.