రేపటినుంచి బ్రేక్ దర్శన సమయం మార్పు
ABN , First Publish Date - 2022-11-30T03:24:29+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 1నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8గంటలకు మార్చనున్నారు.
నేటినుంచి తిరుపతి మాధవంలో శ్రీవాణి కౌంటర్
ప్రయోగాత్మకంగా పరిశీలించనున్న టీటీడీ
తిరుమల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 1నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8గంటలకు మార్చనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా గురువారం నుంచి వీఐపీ బ్రేక్ సమయాన్ని మార్పు చేసి నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో తిరుమలలో గదులపై కూడా ఒత్తిడి తగ్గే అవకాశముందని టీటీడీ భావిస్తోంది. ఇక శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ను ప్రారంభించనున్నారు. రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 9గంటల వరకూ ఈ కౌంటర్ అందుబాటులో ఉంటుంది. శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇక్కడే ఆఫ్లైన్ టికెట్లు, గదులు మంజూరు చేస్తారు. ఈ టికెట్లు తీసుకున్న భక్తులకు మరుసటి రోజు వీఐపీ బ్రేక్లో శ్రీవారి దర్శనం కల్పిస్తారు.