విజలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చోరీకి విఫలయత్నం
ABN , First Publish Date - 2022-05-30T06:03:07+05:30 IST
రామకుప్పం మండలం విజలాపురంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు
రామకుప్పం, మే 29: రామకుప్పం మండలం విజలాపురంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది కథనం మేరకు... ఆదివారం తెల్లవారు జామున 1 గంట ప్రాంతంలో దుండగులు సీసీ కెమెరా వైర్లను కట్ చేసి, బ్యాంకు ప్రధాన ద్వారం తాళాలను ధ్వంసం చేశారు. అలాగే షట్టర్ను గ్యాస్ కట్టర్తో మనిషి లోనికి వెళ్లేంత కట్ చేశారు. అనంతరం బ్యాంకులోకి ప్రవేశించారు. లోపల లాకర్ను పగలగొట్టే ప్రయత్నిస్తుండగా సైరన్ మోగింది. సైరన్ మోత ఎంతకూ ఆగకపోవడంతో దుండగులు పరారయ్యారు. స్థానికులు సైరన్ మోత విని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల ద్వారా సంఘటన వివరాలు తెలుసుకున్నారు. క్లూస్టీం బ్యాంకుకు చేరుకుని వేలిముద్రలు సేకరించింది. నగదు, బంగారు నగల చోరీ జరగలేదని బ్యాంకు మేనేజర్ సవిత తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సంఘటనా స్థలాన్ని సందర్శించిన పలమనేరు డీఎస్పీ గంగయ్య, కుప్పం రూరల్ సీఐ సూర్యమోహనరావు తెలిపారు. దుకాణదారులు, ప్రైవేటు సంస్థలతో బాటూ ఇళ్లలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యాంకులో నగదు, బంగారు నగలు చోరీ కాకపోవడంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో ఇటీవల వరుస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.