కొర్లగుంటలో దళిత కుటుంబంపై దాడి
ABN , First Publish Date - 2022-06-07T07:01:04+05:30 IST
కార్వేటినగరం మండలం కొర్లగుంటలో 50 ఏళ్లుగా నివసిస్తున్న నరేష్, ఆయన భార్య దేవికపై.. పక్కన నివాసం ఉంటున్న సుధాకర్ కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు.
కార్వేటినగరం, జూన్ 6: కార్వేటినగరం మండలం కొర్లగుంటలో 50 ఏళ్లుగా నివసిస్తున్న నరేష్, ఆయన భార్య దేవికపై.. పక్కన నివాసం ఉంటున్న సుధాకర్ కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇంటిదారి విషయమై కొంత కాలంగా తగాదా ఉంది. రెవెన్యూ అధికారులు నరేష్ ఇంటి రికార్డులను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఈ క్రమంలో సుధాకర్ కుటుంబీకులు ఆదివారం రాత్రి దళితుడైన నరేష్ దంపతులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన నరేష్, దేవికను 108 వాహనం ద్వారా పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయాస్పత్రికి తీసుకెళ్లారు. గాయపడిన భార్యాభర్తలు ప్రస్తుతం రుయాలో చికిత్స పొందుతున్నారు. కాగా, సుధాకర్ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్ఐ పట్టించుకోలేదని దళిత సంఘాలు ఆరోపించాయి. ఆందుకే ఈ దాడి జరిగిందని అంటున్నారు. దళిత కుటుంబాలపై ఇలా ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతూ ఉంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం అనేది ఉందా అని ప్రశ్నించారు. ఇకపై దళిత సంఘాలన్నీ కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. దళిత కుటుంబంపై జరిగిన దాడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.