అలిపిరిలో కలకలం
ABN , First Publish Date - 2022-11-03T01:17:47+05:30 IST
తిరుమల యాత్రికుల వాహనాలతో హడావుడిగా ఉండే అలిపిరి చెక్ పాయింట్లో ఓ యువకుడు తనను కిడ్నాప్ చేశారంటూ కేకలు వేయడం బుధవారం రాత్రి కలకలం రేకెత్తించింది.
- తనను కిడ్నాప్ చేశారంటూ ఓ యువకుడి కేకలు
- కారుతో ముందుకెళ్లిపోయిన ఇద్దరు యువకులు
- పోలీసులు అడ్డుకోబోగా లోయలోకి దూకేశారు
తిరుమల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తిరుమల యాత్రికుల వాహనాలతో హడావుడిగా ఉండే అలిపిరి చెక్ పాయింట్లో ఓ యువకుడు తనను కిడ్నాప్ చేశారంటూ కేకలు వేయడం బుధవారం రాత్రి కలకలం రేకెత్తించింది. తనను కాపాడాలంటూ బిగ్గరగా అతను అరుస్తుండగానే కారు లోపలున్న కొందరు యువకులు ఘాట్రోడ్డు వైపు పరుగులు తీయడం భక్తులను భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసుల కథనం మేరకు..తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాహుల్ చైతన్య, ప్రవల్లిక మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.రాహుల్ చైతన్య ఉద్యోగ నిమిత్తం తిరుపతి జిల్లా రేణిగుంటలోని గౌరినగర్లో ఉంటున్నాడు. భర్త పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు మూడురోజుల క్రితం రేణిగుంటకు వచ్చిన ప్రవల్లిక రాహుల్ చైతన్య వేరే మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని గుర్తించింది.దీంతో వెనక్కి వెళ్లిపోయిన ఆమె తన జీవితం నాశనమైపోయిందంటూ కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడింది.దీంతో ప్రవల్లిక సోదరుడు తాను స్నేహితులతో తిరుమలకు వెళుతున్నానని, అక్కడే రాహుల్తో మాట్లాడతానని చెప్పి ఓదార్చాడు.రేణిగుంటకు వచ్చిన వారు రాహుల్ చైతన్యను తమ కారులో ఎక్కించుకుని తిరుమలకు వెళ్లేందుకు అలిపిరికి చేరుకున్నారు.మధ్యలో మాటలు కలిపిన రాహుల్ చైతన్య తాను ప్రమాదంలో పడ్డానని గ్రహించి అలిపిరి చెక్పాయింట్లో బిగ్గరగా అరుస్తూ తనను కిడ్నాప్ చేశారు, రక్షించాలంటూ వీరంగం సృష్టించాడు. ఇంతలో భయంతో కారులోని యువకులు ముందుకు పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది వారిలో లోకేష్, రాజేష్, గణేష్లను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు యువకులు అదే కారులో చెక్పాయింట్ను దాటుకుని పారిపోయారు.విజిలెన్స్ అధికారుల సమాచారంతో రెండవ ఘాట్రోడ్డులోని లింక్రోడ్డు వద్ద పోలీసులు కారును అడ్డుకోగలిగారు. ఈ క్రమంలో వారిద్దరూ కారును వదిలిపెట్టి పక్కనే వున్న లోయలోకి దూకేశారు.అది ప్రమాదకర ప్రదేశం కావడంతో పోలీసులతో పాటు ఆక్టోపస్ దళాలు వారికోసం గాలిస్తున్నాయి.