Chandrababu: గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన చంద్రబాబు..

ABN , First Publish Date - 2022-09-22T19:54:33+05:30 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిశారు.

Chandrababu: గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన చంద్రబాబు..

అమరావతి (Amaravathi): ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ (Biswabhushan Harichandan)ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కలిశారు. ఈ సందర్భంగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై.. టీడీపీ బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యూనివర్శిటీకి ఎన్టీఆర్ (NTR) పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు.


1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ (Medical College) తీసుకువచ్చామన్నారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan reddy) దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ చీకటి జీవో తెచ్చారని, హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.


జగన్‌ పాలనలో 3 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చిందని చంద్రబాబు అన్నారు. రాత్రి వాళ్ల నాన్న (వైఎస్సార్) ఆత్మతో మాట్లాడి హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కంటే వైఎస్‌ఆర్‌ ఎలా గొప్ప వ్యక్తి? అంటూ నిలదీశారు. వైఎస్‌ఆర్‌, జగన్ కలిసి ఎన్ని మెడికల్‌ కాలేజీలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మించి.. వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకోవాలన్నారు. వైద్యరంగాన్ని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-22T19:54:33+05:30 IST