రఘురామ ఫోన్ ట్యాపింగ్పై నివేదిక తెప్పించండి
ABN , First Publish Date - 2022-12-13T03:36:20+05:30 IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం నుంచి వాస్తవిక నివేదిక తెప్పించి 15 రోజుల్లో సమర్పించాలని కేంద్ర హోం శాఖకు లోక్సభ సచివాలయం సోమవారం సూచించింది.
కేంద్ర హోం శాఖకు లోక్సభ సచివాలయం లేఖ
న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం నుంచి వాస్తవిక నివేదిక తెప్పించి 15 రోజుల్లో సమర్పించాలని కేంద్ర హోం శాఖకు లోక్సభ సచివాలయం సోమవారం సూచించింది. రాష్ట్ర పోలీసులు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, అందుకు బాధ్యులైన ఇంటెలిజెన్స్ చీఫ్ పి.సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్పై చర్యలు తీసుకోవాలని గత నెలలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామరాజు లేఖ రాశారు. దానిని సభాహక్కుల ఉల్లంఘన కింద విచారించాలని ఆయన ప్రివిలేజ్ కమిటీకి నివేదించారు. దానిపై స్పందించిన కమిటీ గత నెల 14న హోం శాఖకు వాస్తవిక నివేదిక తెప్పించాలని సూచించింది. ఇంకా నివేదిక అందకపోవడంతో లోక్సభ సచివాలయం హోం శాఖకు లేఖ రాసింది.