Bonda Uma: జగన్ కేసుల్లో లాయర్లకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం విడ్డూరం...
ABN , First Publish Date - 2022-09-27T20:36:39+05:30 IST
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వివిధ కేసులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని...
అమరావతి (Amaravathi): జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అధికారంలోకి వచ్చినప్పటినుంచి వివిధ కేసులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న సీబీఐ (CID), ఈడీ (ED) కేసులు వాదిస్తున్న లాయర్లకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం న్యాయవాదులను నియమించడంలేదని, జగన్ కేసులు వాదిస్తున్నలాయర్లకు రూ. కోట్లు చెల్లించి ప్రభుత్వకేసులు అప్పగించడం అన్యాయమన్నారు.
పోలవరంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు వెళ్తే దానికీ ప్రభుత్వ సొమ్మే ఖర్చు చేసిందని బోండా ఉమ అన్నారు. ఏపీ.. ప్రైవేటు న్యాయవాదులను నియమించుకోవడంపై సుప్రీం కోర్టు కూడా నివ్వెరపోయిందన్నారు. జగన్ న్యాయవాదులపై పెడుతున్న ఖర్చులపై నోటీసులు ఇవ్వాల్సివస్తుందని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. ప్రైవేటు న్యాయవాదులపై వందల కోట్లు ఫీజులుగా చెల్లించడం అన్యాయమన్నారు. గాలి జనార్థన్ రెడ్డి, భారతి సిమెంటు, జగతి పబ్లికేషన్, వివేకానందరెడ్డి హత్య కేసులకు రాష్ట్ర ప్రజల సొమ్మా? అని బోండా ఉమ ప్రశ్నించారు.