అసమర్థతకు పైత్యం తోడయింది: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-09-10T09:37:02+05:30 IST
పాలకుల అసమర్థతకు పైత్యం తోడైతే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పాలకుల అసమర్థతకు పైత్యం తోడైతే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ట్విటర్లో విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో రోడ్డు సేఫ్టీకి ప్రమాణాలున్నాయి. పసుపు, నలుపు రంగులు రోడ్డు చివర డివైడర్లు, ఇతర నిర్మాణాలకు వేస్తారు. కానీ వంతెనల రంగు మార్చారు. ఇది జగన్రెడ్డి మెప్పు కోసం ఓ అధికారి పాట్లు అనుకోవాలా? బాధ్యత మరిచిన బడుద్ధాయి అనాలా? సీఎంకి పసుపు రంగు కనపడకూడదని రంగులు మార్చాడట ఆ బుద్ధి లేని అధికారి. చేతనైతే రోడ్లు బాగు చేయండి. కులం, మతం, పార్టీ చూడం అన్న ఈ పాలకుడు నిష్పక్షపాతంగా ప్రజా సేవ చేస్తాడా?’’ అని అచ్చెన్న ఎద్దేవా చేశారు.