Atchennaidu: పోలీసుల పహారా మధ్య జగన్ పర్యటన నవ్వు తెప్పిస్తోంది..

ABN , First Publish Date - 2022-09-23T16:28:24+05:30 IST

సీఎం జగన్ కుప్పం పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

Atchennaidu: పోలీసుల పహారా మధ్య జగన్ పర్యటన నవ్వు తెప్పిస్తోంది..

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) ట్వీట్ (Tweet) చేశారు. సీఎం జగన్ (CM Jagan) కుప్పం (Kuppam) పర్యటన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పోలీసుల పహారా మధ్య సీఎం పర్యటన నవ్వు తెప్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రిలో ఏదో అభద్రత, అనుమానం స్పష్టంగా కనిపిస్తోందని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.


కాటా సీఎం జగన్ కప్పం పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను బైండోవర్‌ చేశారు. దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్దకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. కుప్పంలో టీడీపీ నేతల ఇళ్ల వద్ద కానిస్టేబుళ్లను కాపలా కూడా ఉంచారు. ఎప్పుడూ లేని విధంగా.. ప్రతిపక్షాలు బయటకు రాకూడదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలా కుప్పంలో శుక్రవారం నాటి సీఎం సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ‘చేయూత’ లబ్ధిదారులకు మూడో విడత నగదు జమచేసేందుకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కనున్నారు. 


ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్య నియోజకవర్గమైన కుప్పంలో జరిగే సీఎం సభ నేపథ్యంలో టీడీపీ నేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడ నిరసన తెలుపుతారోనని కొందరిని ఇళ్లవద్దే హౌస్‌ అరెస్టులు చేశారు. మరికొందరిని బైండోవర్‌ చేసి నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం వంటి దూర ప్రాంతాల తహసీల్దార్ల వద్ద హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో కుప్పంలో బంద్‌ వాతావరణం నెలకొంది. మరోవైపు ఎటు చూసినా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు, చెట్లకూ పార్టీ రంగులేశారు.

Updated Date - 2022-09-23T16:28:24+05:30 IST