15 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - 2022-09-10T09:04:58+05:30 IST
అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 15 నుంచి శాసనసభ , శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.
నోటిఫికేషన్ విడుదల
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 15 నుంచి శాసనసభ , శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు లెజిస్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఉత్తర్వులు విడుదల చేశారు. శాసనసభ సమావేశాలు 15వ తేదీ ఉదయం 9 గంటలకు, మండలి సమావేశాలు అదేరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో తెలిపారు.
ప్రతిపక్షం భయంతోనే తక్కువ రోజులు: యనమల
ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాల సమయాన్ని కుదిస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ‘‘చట్ట సభల నిర్వహణకు రాజ్యాంగ నిర్మాతలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దానివల్ల ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుందని వారు భావించారు. జగన్ ప్రభుత్వం ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. ఏడాదికి పాతిక రోజులకు మించి చట్టసభలు నిర్వహించడం లేదు. పోయిన ఏడాది మరీ ఘోరంగా 15 రోజులు మాత్రమే నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల కంటే తక్కువ రోజులు సభలు నిర్వహించారు’’ అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.