‘రె వెన్యూ’ అవినీతి శాఖా?

ABN , First Publish Date - 2022-04-24T09:24:01+05:30 IST

రెవెన్యూలో ఎక్కడో ఒకచోట తప్పు జరిగితే మొత్తాన్నీ అవినీతి శాఖగా చూపేందుకు చేసే ప్రయత్నాలను..

‘రె వెన్యూ’ అవినీతి శాఖా?

ఎక్కడో ఒక తప్పు జరిగితే మొత్తానికీ ఆపాదించడం తగదు

కార్యాలయాల్లో ఇప్పటికే 1990నాటి కంప్యూటర్లే

పీఆర్సీ జీవోలు కొన్నే బయటపెట్టింది : ప్రభుత్వంపై బొప్పరాజు ఫైర్‌


ఒంగోలు(కలెక్టట్‌), ఏప్రిల్‌ 23: రెవెన్యూలో ఎక్కడో ఒకచోట తప్పు జరిగితే మొత్తాన్నీ అవినీతి శాఖగా చూపేందుకు చేసే ప్రయత్నాలను మానుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఒంగోలులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేని ఇతర శాఖ పనులు చేస్తుండటం ఒక కారణం కాగా, ఇంకొకవైపు సర్వర్లు పనిచేయని కారణంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయాల్లో 1990నాటి కంప్యూటర్లే ఉన్నాయన్నారు. దీంతో ఉద్యోగులే సొంత డబ్బులతో కంప్యూటర్లు, ల్యాప్‌టాపులు కొని పనిచేస్తున్నారని తెలిపారు. సర్వర్‌ సమస్యలకు ఉద్యోగులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం రోజుకో సాఫ్ట్‌వేర్‌ తీసుకొస్తోందని, అయితే అందుకు సంబంధించిన శిక్షణలు ఇస్తున్న పరిస్థితి లేదని పేర్కొన్నారు. చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ బిల్లులు కూడా కట్టడం లేదని, దీంతో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోతోందని, దీనికి  బాధ్యులు రెవెన్యూ అధికారులేనా అని ప్రశ్నించారు.   గుడివాడలో ఆర్‌ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. పీఆర్సీకి సంబంధించి కొన్ని జీవోలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, పే స్లిప్పులు కూడా దాచిపెట్టిందని, దీంతో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఆగిపోయాయని తెలిపారు.  

Updated Date - 2022-04-24T09:24:01+05:30 IST