లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు
ABN , First Publish Date - 2022-03-23T08:20:15+05:30 IST
టీడీపీ నేత నారా లోకేశ్ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని డిప్యూటీ సీఎం..
ఖరీదైన మద్యం తాగినా ఆరోగ్యం
పాడవకుండా ఉండదు: నారాయణస్వామి
అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేత నారా లోకేశ్ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగులకు న్యాయం చేస్తున్న ప్ర భుత్వాన్ని కూలగొడతామంటే కోపం రాదా? అని ప్రశ్నించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో జగన్ సర్కార్కు ఇబ్బందులు వస్తాయని ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పారని, ఆ వ్యక్తిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను లోకేశ్ను ఉద్దేశించి చేసినట్లు ఆయన భావిస్తున్నారేమోనన్నారు. మద్యం వ్యాపారాలు టీడీపీ నేతలే చేశారని ఆరోపించారు. యనమల వియ్యంకుడు, అయ్యన్నపాత్రుడు లాంటి వారు మద్యం డిస్టిలరీలు నడుపుతున్నారన్నారు. ఖరీదైన మద్యం తాగినా 10-15ఏళ్లకు ఆరోగ్యం పాడవకుండా ఉండదన్నారు. జంగారెడ్డిగూడెం సారా మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీలను చులకనగా చూసిన చంద్రబాబుకు మద్య నిషేధం, మద్య నియంత్రణల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.