కొల్లేరు పరిధిలో చేపల చెరువులపై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2022-02-19T09:13:26+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం అగడలలంక గ్రామం కొల్లేరు సరస్సు పరిధిలో చేపల చెరువుల తవ్వకాలను ...
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం అగడలలంక గ్రామం కొల్లేరు సరస్సు పరిధిలో చేపల చెరువుల తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామం పరిధిలోని సర్వే నం.1424లో చేపల చెరువు తవ్వకాలతో పాటు ఇతర కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రతివాది రమణ ఫిషరీస్ ప్రైవేట్ లిమిటెడ్ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ వేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అగడలలంక గ్రామం పరిధిలో రమణ ఫిషరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిబంధలకు విరుద్ధంగా చేపల చెరువులు ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని సవాల్ చేస్తూ ఘంటసాల నరేంద్రబాబు పిల్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.... పిటిషనర్ నుంచి రమణ ఫిషరీస్ భూమిని కొనుగోలు చేసిందన్నారు. సంబంధిత సర్వే నం.1424 ఐదో కాంటూర్ లోపల ఉందని, అక్కడ చేపల చెరువులు తవ్వకాలు జరపడానికి వీల్లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు అనుమతులు ఇచ్చారన్నారు.