ఆంధ్రజ్యోతి, ఏబీఎన్పై కాల్వ దాడి చేయిస్తారు
ABN , First Publish Date - 2022-12-30T03:18:32+05:30 IST
‘ఏబీఎన్’లో నాపై అసత్య కథనాలు వస్తున్నాయి. వాటిపై తానే దాడి చేయించి... ఆ పని నేను చేశానని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నమ్మించడానికి ప్రయత్నిస్తారు.
ఆ నిందను నాపై మోపుతారు: కాపు వ్యాఖ్యలు
కాపుపై చర్య తీసుకోవాలని కాల్వ డిమాండ్
రాయదుర్గం, డిసెంబరు 29: ‘‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్’లో నాపై అసత్య కథనాలు వస్తున్నాయి. వాటిపై తానే దాడి చేయించి... ఆ పని నేను చేశానని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నమ్మించడానికి ప్రయత్నిస్తారు. రాబోయే రోజుల్లో ఆ పత్రిక, మీడియా ప్రతినిధులకు ఏమి జరిగినా ఆ నింద నాకు అంటగట్టే అవకాశం ఉంది. కానీ, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి’’ అని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి, ‘ఏబీఎన్’ విలేకరులకు భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కోరుతున్నానని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అయితే, ప్రభుత్వ విప్ హోదాలో ఉండి విలేకరుల సమావేశంలో ఇలాంటి బెదిరింపులు చేయడం చర్చనీయాం శం అయింది. కాపు వ్యాఖ్యలను చూస్తే, ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ విలేకరులపై దాడి చేసేందుకు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై కాల్వ శ్రీనివాసులు వివరణ కోరగా, తానూ పాత్రికేయ వృత్తి నుంచే వచ్చానని తెలిపారు. తనపై బురద చల్లి, దాడి చేసే కుట్రకు తెరలేపిన కాపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.