జగన్.. శవ రాజకీయాల బ్రాండ్ అంబాసిడర్
ABN , First Publish Date - 2022-12-30T02:58:13+05:30 IST
శవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్రెడ్డి అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.
తండ్రి శవం పక్కనే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ
బాబాయి హత్యను కూడా రాజకీయం కోసం వాడుకొన్న ఘనుడు: అనిత
అమరావతి(ఆంధ్రజ్యోతి), సామర్లకోట, డిసెంబరు 29: శవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్రెడ్డి అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. గురువారం ఆమె ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి కోసం శవం పక్కనే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయించిన చరిత్ర జగన్రెడ్డిది. సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే ఆ హత్యను కూడా తన రాజకీయం కోసం వాడుకొని చంద్రబాబే తన బాబాయిని చంపాడని ప్రచారం చేయించిన ఘనత కూడా ఆయనదే. తండ్రి మరణంతో ఆయన ప్రారంభించిన శవ రాజకీయం బాబాయి హత్య వరకూ కొనసాగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రల పేరుతో నటనలో విశ్వరూపం చూపించిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పలకరింపులు కూడా లేకుండా నిజ స్వరూపం చూపిస్తున్నారు. కందుకూరు ఘటనలో మరణించిన వారిపై ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైతే జగన్ రెడ్డి కనీసం విచారం వ్యక్తం చేయకపోగా శవాలపై పేలాలు ఏరుకొనే పని మొదలు పెట్టారు. మరణించిన వారి కుటుంబాలకు సాయం చేయాలన్న ఆలోచన వదిలి, చంద్రబాబును ఏం తిట్టాలన్న ఆలోచనలు చేస్తున్నారు’’ అని విమర్శించారు. ‘‘జగన్రెడ్డి ఓదార్పు యాత్ర సమయంలో ఒంగోలులో కరెంటు షాక్ తగిలి ఐదుగురు చనిపోయారు. దానిని ఆయన మర్చిపోయారా? జగన్ సభల్లో ప్రమాదాల్లో మరణించిన వారికి టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం కింద రూ.ఐదు లక్షలు సాయం చేసింది. జగన్ మాత్రం కందుకూరు ఘటనపై నోరు కూడా తెరవలేదు. ప్రధాన మంత్రి స్పందించి ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత అప్పుడు కదిలారు’’ అని అనిత విమర్శించారు.