kottu satyanarayana: ఇంద్రకీలాద్రిపై స్వయంగా క్యూలైన్లను పరిశీలించిన ఏపీ మంత్రి

ABN , First Publish Date - 2022-09-27T16:06:28+05:30 IST

దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంద్రికీలాద్రిని సందర్శించారు.

kottu satyanarayana: ఇంద్రకీలాద్రిపై స్వయంగా క్యూలైన్లను పరిశీలించిన ఏపీ మంత్రి

విజయవాడ: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) ఇంద్రికీలాద్రిని సందర్శించారు. అక్కడ స్వయంగా క్యూలైన్లను పరిశీలించిన మంత్రి... దసరా మహోత్సవాల ఏర్పాట్లపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తొలిరోజు చిన్నచిన్న సమస్యలు తలెత్తాయన్నారు. ఈరోజు భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్షిస్తూనే ఉన్నామని అన్నారు. తొలిరోజు అమ్మవారిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, 60 వేల లడ్డూల విక్రయాలు జరిగాయన్నారు. క్యూలైన్ల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాల్లో నిన్న సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని... ఈరోజు ఆన్‌లైన్‌లోనూ టిక్కెట్లు విక్రయిస్తామని మంత్రి (AP Minister) చెప్పారు.


ఆన్‌లైన్ టిక్కెట్లను స్కాన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనాల కోసం ప్రత్యేక టైమ్ స్లాట్ కేటాయించినట్లు చెప్పారు. టైమ్ స్లాట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. నిర్ధేశించిన టైమ్‌స్లాట్ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులు దర్శనానికి రావాలన్నారు. లడ్డూ ప్రసాదాల్లో ఎలాంటి కొరత లేదని, నాణ్యతలో రాజీలేకుండా తయారు చేస్తున్నామని చెప్పారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని నిన్న టీడీపీ నేత దేవినేని ఉమ తనతో చెప్పారన్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యతపై టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యలు పట్టించుకోనవసరం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. 

Updated Date - 2022-09-27T16:06:28+05:30 IST