AP Highcourt: విశాఖ రిషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-27T19:44:07+05:30 IST

విశాఖ రిషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషికొండలో అనుమతించిన దాని కంటే అక్రమ తవ్వకాలు ఉంటే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేసింది.

AP Highcourt: విశాఖ రిషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి: విశాఖ రిషికొండ (Rishikonda) తవ్వకాలపై ఏపీ హైకోర్టు (High court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషికొండలో అనుమతించిన దాని కంటే అక్రమ తవ్వకాలు ఉంటే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేసింది. ఆరు నెలల పాటు అందరూ లోపలికి వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. రిషికొండ అక్రమ తవ్వకాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. టూరిజం కార్పొరేషన్‌ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మనుసింఘ్వీ (Abhishek Manusinghvi)  హాజరయ్యారు. ఈ క్రమంలో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కావాలని ధర్మాసనాన్ని సంఘ్వీ కోరారు. రిషికొండ దగ్గర 9 ఎకరాల పరిధిలో మాత్రమే తవ్వకాలకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.


అయితే 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరిపారని ధర్మాసనానికి పిటిషనర్‌ తరపు న్యాయవాది అశ్విని కుమార్ (Ashwini kumar) వివరించారు. తవ్విన మట్టిని సముద్రంలో వేయాలని కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులపై  పిటిషనర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఎవరైనా వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. తాను పర్యటించి పరిశీలించానని న్యాయవాది అశ్విని కుమార్‌ చెప్పారు. పిటిషనర్ల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటుందని  లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఎవరు తేలికగా తీసుకున్నా... తాము మాత్రం అక్రమాలు జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ... రిషికొండ తవ్వకాల కేసు విచారణ హైకోర్టు వాయిదా వేసింది. 


Updated Date - 2022-07-27T19:44:07+05:30 IST