రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక పాలన: సోము
ABN , First Publish Date - 2022-09-19T09:25:47+05:30 IST
రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక పాలన: సోము
వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బస్సు యాత్ర
విశాఖలో లాంఛనంగా ప్రారంభం
విశాఖపట్నం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక పాలన సాగుతున్నది. ఏపీలో అంధకారం నెలకొంది. రాష్ట్రంలో మైన్, వైన్, శాండ్ పేరుతో దోపిడీ జరుగుతోంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ‘ప్రజా పోరు’ నినాదంతో ‘అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా’ చేపట్టిన బస్సు యాత్రను ఆయన నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. దీనికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లలో ఈ నగరంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. రాష్ట్రంలో మైన్, వైన్, శాండ్ పేరుతో దోపిడీ జరుగుతోంది. మూడు రాజధానుల పేరుతో అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులను మోసం చేయడం దారుణం’’ అని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, బీజేపీ నగర అధ్యక్షుడు రవీంద్ర పాల్గొన్నారు.