ఏపీ వ్యాప్తంగా నిరసనలకు టీడీపీ పిలుపు
ABN , First Publish Date - 2022-04-14T04:08:23+05:30 IST
ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు ..
అమరావతి: ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ కాంప్లెక్స్లు, బస్ డిపోలు ఎదురుగా నిరసనలు తెలపాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కాగా ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక నుంచి పల్లెవెలుగు బస్సు కనీస ఛార్జీ రూ. 10 ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ చార్జీలపై డీజిల్ సెస్ విధించారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5 పెంచినట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రేపట్నుంచి పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.10 ఉంటుందని ఆయన వెల్లడించారు. సెస్ పెంపు వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.
ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి ఉందని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉపయోగంలో లేని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటామని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.