వైసీపీ సేవలో తరించిన ఏయూ
ABN , First Publish Date - 2022-04-24T09:43:33+05:30 IST
ఆంధ్రవిశ్వవిద్యాలయం సిబ్బంది శనివారం వైసీపీ సేవలో తరించారు. పార్టీ ఆధ్వర్యంలో..
జాబ్ మేళా కోసం సెలవు ప్రకటించిన యూనివర్సిటీ
విశాఖపట్నం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రవిశ్వవిద్యాలయం సిబ్బంది శనివారం వైసీపీ సేవలో తరించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో పదుల సంఖ్యలో ఉద్యోగులు సేవలు అందించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ నేతలు శని, ఆదివారాల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు ఏయూని వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి అధికారులు శనివారం సెలవు ప్రకటించేశారు. వర్సిటీలోని పలు విభాగాలకు చెందిన 13 బ్లాకుల్లో వందలాది గదులను జాబ్ మేళాకు కేటాయించారు. సదరు డిపార్టుమెంట్కు చెందిన ఇద్దరు, మగ్గురు సిబ్బందిని సేవల నిమిత్తం పురమాయించారు. వర్సిటీకి చెందిన వందల మంది విద్యార్థులను వలంటీర్లుగా నియమించారు. ఈ జాబ్ మేళా వర్సిటీ ఉన్నతాధికారి కనుసన్నల్లో జరగడంతో ఇష్టం లేకపోయినా సిబ్బంది సేవలు అందించాల్సి వచ్చింది. జాబ్ మేళా జరుగుతున్న తీరును వర్సిటీ అధికారులు, డీన్లు పర్యవేక్షించడంతో పాటు సిబ్బంది, విద్యార్థులకు సూచనలు, సలహాలను ఇస్తూ కనిపించారు. కాగా, వైసీపీ జాబ్మేళాలో వర్సిటీ సిబ్బందితోపాటు పలు ప్రభుత్వ శాఖలు సిబ్బంది కూడా సేవలు అందించారు. ఒక్క విశాఖ జిల్లా నుంచే కాకుండా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నుంచి కూడా కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది వచ్చారు. డీఆర్డీఏ పరిధిలోని సీడాప్ విభాగానికి చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు, జీవీఎంసీ, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఈ జాబ్ మేళాలో సేవలు అందించారు.