సీఎం జగన్ అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజలకు కరెంట్ కష్టాలు

ABN , First Publish Date - 2022-04-10T21:08:27+05:30 IST

ఏపీలో జగన్ రెడ్డి అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడంలేదు.

సీఎం జగన్ అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజలకు కరెంట్ కష్టాలు

అమరావతి: ఏపీలో జగన్ రెడ్డి అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడంలేదు. ముందుచూపులేని నిర్ణయాలతో రాష్ట్రమంతటా అంథకారం నెలకొంది. అధికారంలోకి రాగానే జగన్ పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పీపీఏలను రద్దు చేశారు. ‘మాకు మీ కరెంట్ వద్దంటూ జాతీయ, అంతర్జాతీయ విద్యుత్ సంస్థలను తరిమేశారు’ అంతేకాదు.. 2024 తర్వాత అమల్లోకొచ్చే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సిద్ధపడ్డారు. నవ్యాంధ్రలో విద్యుత్ రంగం కష్టాలకు అప్పుడే బీజం పడింది.


చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థలు సౌర, పవన విద్యుత్ సంస్థలతో యూనిట్ రూ. 4.65కు ఒప్పందాలు చేసుకున్నాయి. దీన్ని ప్రతిపక్షంలో ఉన్న జగన్.. తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒప్పందాలను రద్దు చేస్తానని ప్రకటించారు. ఈ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం నిలిపివేశారు. దాంతో ఆ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సగం ధర చెల్లిస్తూ వచ్చారు. జెన్‌కో, థర్మల్ విద్యుత్ కేంద్రాలను షట్ డౌన్ చేసి వాటికి కూడా ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లిస్తూ వచ్చారు. దీంతో కరెంట్ కొనుగోలు చేయకుండానే ఏటా దాదాపు రూ. 4వేల కోట్లమేర చెల్లింపులు జరపాల్సి వచ్చింది. పీపీఏల మేరకు కరెంట్ కొంటున్నామని చెబుతున్నా.. ఆ వివరాలు బయటపెట్టడంలేదు. నిజంగానే ఆ కరెంట్ అందుబాటులో ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు వచ్చేవి కావని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-04-10T21:08:27+05:30 IST