రూ.20 కోట్ల స్థలంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి కన్ను!

ABN , First Publish Date - 2022-07-05T01:39:36+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అడపాల వీధిలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంపై కొందరి కన్ను పడింది.

రూ.20 కోట్ల స్థలంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి కన్ను!

కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అడపాల వీధిలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంపై కొందరి కన్ను పడింది. దీనికోసం కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి అనుచరుడు కుర్లి శివారెడ్డి తొలి అడుగు వేశారు. సుమారు రూ.85 లక్షల విలువైన 3.5 సెంట్లను ఆయన ఆక్రమించుకున్నారు. అందులో ఆదివారం అర్ధరాత్రి గోడలు కట్టించారు. వాటిని కూల్చడానికెళ్లిన సోమవారం మధ్యాహ్నం వెళ్లిన తహసీల్దార్‌ గోపాలక్రిష్ణ, ఇతర రెవెన్యూ అధికారులపై పట్టణ సీఐ మధు సమక్షంలోనే వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు కుర్లి శివారెడ్డి, కదిరి మున్సిపాలిటీ వైఎస్‌ చైర్మన్‌ అజ్జుకుంట రాజశేఖర్‌రెడ్డి రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు.


‘ఆక్రమణలు మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట నోటీసు ఇవ్వాలని, ఆ తరువాతే కూల్చాలని హుకుం జారీ చేశారు. దీంతో ‘ప్రభుత్వ స్థలంలో నిర్మాణ పనులు చేపడితే ఎందుకు నోటీసులివ్వాలి?’ అని తహసీల్దార్‌ ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఎందుకు గోడలు కట్టారని నిలదీశారు. దీంతో ‘అప్పుడు కాదు, ఇప్పుడే కడతాం. మీకు చేతనైనది చేసుకోండి’ అని తహసీల్దారుకు రాజశేఖర్‌ రెడ్డి సవాలు విసిరారు. అడపాల వీధిలో 84 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. 2006లో ఇందులో 24 మందికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందినవారు అనర్హులని తేలడంతో అప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌ రద్దు చేశారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ.20 కోట్లు పలుకుతోంది. 

Updated Date - 2022-07-05T01:39:36+05:30 IST