కదిరిలో మళ్లీ వైసీపీ దాష్టీకం
ABN , First Publish Date - 2022-11-24T23:51:42+05:30 IST
కదిరిలో వైసీపీ నాయకులు మళ్లీ బరితెగించారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మైనార్టీ పరిరక్షణ సమితి నాయకుడు ఫారుఖ్ షిగ్లీపై దాడికి యత్నించారు.
పరామర్శకు వచ్చిన ముస్లిం నేతపై దాడికి యత్నం
మిన్నకుండిపోయిన పోలీసులు
కదిరి, నవంబరు 24: కదిరిలో వైసీపీ నాయకులు మళ్లీ బరితెగించారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మైనార్టీ పరిరక్షణ సమితి నాయకుడు ఫారుఖ్ షిగ్లీపై దాడికి యత్నించారు. పరుషపదజాలంతో రెచ్చిపోయారు. వైసీపీ నాయకులు అంతలా రెచ్చిపోతున్నా పోలీసులు చూస్తూ మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లి సమీపంలో ఉన్న మార్కెట్యార్డు వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్యార్డుకు సమీపంలో ఇమామ్బీ, కళావతమ్మలు కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఆ భూమిపై తమకే హ క్కు ఉందంటూ వైసీపీకి చెందిన నూరుల్లా, నాసీర్, యహసాన, గయాజ్తోపాటు సీపీఐకి చెందిన ఇసాక్లు అర్థరాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న రెండిళ్లను రెండు రోజుల క్రితం కూల్చివేశారు. దీంతో బాధితులను పరామర్శించడానికి గుంటూరుకు చెందిన మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకుడు ఫారుఖ్ షిగ్లీ గురువారం ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడుతుండగా వైసీపీ నాయకులు నూరుల్లా, గయాజ్, యాసాన, నాసీర్, సీపీఐ నాయకుడు ఇసాక్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ నాయకుడిని అడ్డుకుని బాధితులతో వా గ్వాదానికి దిగారు. పత్రికల్లో రాయలేని విధంగా బూతులు తిట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడే ఉండిచూస్తూ ఉండిపోవడం అం దర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పట్టణ సీఐ మధు చేరుకుని ఫారుఖ్ షి గ్లీని అక్కడనుంచి పంపే ప్రయత్నం చేశారు. ‘మీరు రక్షించాల్సిన మై నార్టీ ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయి..’ అంటూ ఓ సలహా ఇచ్చారు. వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా వారిని నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. చివరకు మైనార్టీ నాయకుడు ఫారుఖ్ షిగ్లీని సీఐ బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.
‘బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి’
వైసీపీ నాయకులు కూల్చివేసిన ఇళ్ల బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మైనార్టీ పరిరక్షణ సమితి నాయకులు ఫారుఖ్ షిగ్లీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువైందన్నారు. సీఎం జగనమోహన రెడ్డికి మైనార్టీల ఆక్రందన వినిపించలేదా? అని ప్రశ్నించారు. జగన అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట ముస్లింలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకురాలు పర్వీనభాను, కౌన్సిలర్ అల్ఫాముస్తఫా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన, నాయకులు రోషన, సులేమాన, తెలుగు మహిళలు గంగరత్నమ్మ, ప్రేమలత, పుష్ప తదితరులున్నారు.