రైతుల జోలికి వస్తే ఖబడ్దార్‌

ABN , First Publish Date - 2022-10-12T05:17:32+05:30 IST

‘ఖాళీ భూములు కనిపిస్తే కబ్జాలు చేస్తారా? అధికారం ఉందని అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం. మీ చెంచాలు, రౌడీలు రైతుల జోలికి వస్తే ఖబడ్దార్‌..’ అంటూ వైసీపీ నాయకులపై ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల జోలికి వస్తే ఖబడ్దార్‌
బాధిత రైతులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

 వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్‌ హెచ్చరిక

   ధర్మవరం, అక్టోబరు 11: ‘ఖాళీ భూములు కనిపిస్తే కబ్జాలు చేస్తారా? అధికారం ఉందని అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం. మీ చెంచాలు, రౌడీలు రైతుల జోలికి వస్తే ఖబడ్దార్‌..’ అంటూ వైసీపీ నాయకులపై ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం వద్ద కబ్జాకు గురవుతున్న భూములను పరిటాల శ్రీరామ్‌ మంగళవారం పరిశీలించారు. సూర్య ఎస్టేట్‌ పేరుతో వేసిన వెంచర్‌ వద్ద కురుబ కులానికి చెందిన నలుగురు బాధిత రైతులతో పరిటాల శ్రీరామ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ రైతులకు చెందిన 12 ఎకరాల భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు గొట్లూరు మారుతి, బండి రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు పేదల భూముల్లో విద్యుత స్తంభాలు నాటేందుకు ప్రయత్నిస్తుంటే రైతులు రేయింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న సూర్యఎస్టేట్‌ ఎవరిదని ప్రశ్నించారు. ఆ ఎస్టేట్‌ను మరింత విస్తరింపచేయడానికి బ్రోకర్లు, బినామీలు, రౌడీలు ముందుకొస్తున్నారని మండిపడ్డారు.  రైతులకు అండగా టీడీపీ ఉంటుందని, వారిపక్షాన తాను పోరాడుతానని పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీనాయకులకు వత్తాసు పలుకుతూ బాధితులపైనే కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం బాధిత రైతులతో కలసి పరిటాలశ్రీరామ్‌ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ తిప్పేనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్‌, మేకలరామాంజినేయులు, చింతపులుసు పెద్దన్న, సుధాకర్‌, భీమనేని ప్రసాద్‌ నాయుడు, పురుషోత్తంగౌడ్‌, రామకృష్ణ, లక్ష్మన్న, నాగూర్‌హుస్సేన, షరీఫ్‌, సనత, శ్రీరాములు, భాస్కర్‌చౌదరి, విజయ్‌చౌదరి, అనిల్‌, రాఘవరెడ్డి, వరదరాజులు, రామాంజి, రహీంబాషా, రవీంద్ర, కుళ్లాయప్ప, మహేశ, గంగాధర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-10-12T05:17:32+05:30 IST