టీడీపీతోనే ప్రజలకు న్యాయం: పల్లె
ABN , First Publish Date - 2022-09-25T05:18:45+05:30 IST
ఏపీలో మళ్లీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే పేదప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
కొత్తచెరువు(బుక్కపట్నం), సెప్టెంబరు 24: ఏపీలో మళ్లీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తేనే పేదప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం కొత్తచెరువు మండల పరిధిలోని బైరాపురం పంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలపై అన్ని రకాలుగా పన్నులు పెంచి సామాన్యుడిని సీఎం జగన మోహన రెడ్డి వేధిస్తున్నాడన్నారు. పేదల సంక్షేమపథకాలకు వైసీపీ కోతలు వేసి ప్రజలను మోసం చేసిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడి ప్రజాసంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు. జగన పాలనలో ప్రజాదోపిడీ తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇసుక మైనింగ్, భూకబ్జాలు, మద్యం రేట్లు పెంచడంతప్పా ప్రజలకు ఉపయోగపడే ఒక్కపని ఈ వైసీపీ చేయలేదని మండిపడ్డారు. 2024 ఎన్నికలలో జగనరెడ్డిపాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. బైరాపురం పంచాయతీలో ఇంటింటా తిరుగుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామకోటి ఆదినారాయణ, ఎల్ఐసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.