వరుడు.. వధువు.. ప్రియురాలు..!

ABN , First Publish Date - 2022-08-17T06:28:09+05:30 IST

తెల్లవారితే పెళ్లి. ఇంతలో పోలీస్‌ స్టేషన నుంచి పెళ్లికొడుక్కి ఫోనకాల్‌. ‘నీ కోసం ఓ అమ్మాయి వచ్చింది. ఏమిటి సంగతి..?’ అని. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని, స్టేషనకు వచ్చిన అమ్మాయిని తాను ప్రేమించానని వరుడు చెప్పేశాడు

వరుడు.. వధువు.. ప్రియురాలు..!
వరుడు రమేష్‌

గుత్తి పోలీస్‌ స్టేషనలో అర్ధరాత్రి హైడ్రామా

గుత్తి, ఆగస్టు 16: తెల్లవారితే పెళ్లి. ఇంతలో పోలీస్‌ స్టేషన నుంచి పెళ్లికొడుక్కి ఫోనకాల్‌. ‘నీ కోసం ఓ అమ్మాయి వచ్చింది. ఏమిటి సంగతి..?’ అని. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని, స్టేషనకు వచ్చిన అమ్మాయిని తాను ప్రేమించానని వరుడు చెప్పేశాడు. ఆ వెంటనే నేరుగా పోలీస్‌ స్టేషనకు చేరుకున్నాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న పెళ్లికూతురు తల్లిదండ్రులు స్టేషనకు వచ్చారు. తమను మోసగించారని వరుడు, అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. ఈ ప్రేమ.. పెళ్లి డ్రామాకు అనంతపురం జిల్లా గుత్తి పోలీస్‌ స్టేషన వేదిక అయింది. గుత్తి మండలం ఇసురాళ్లపల్లికి చెందిన రమేశకి పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే, మంగళవారం రాత్రి ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి గుత్తి పోలీస్‌ స్టేషనకు వచ్చింది. రమేశ తనను ప్రేమించాడని, అతనికి మరో యువతితో పెళ్లి జరుగుతోందని, తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో రెండు మూడు గంటలపాటు పోలీస్‌ స్టేషనలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. వరుడు.. వధువును కాకుండా.. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. ఒక సమస్య పరిష్కారమైంది. ఇలా అయితే తమ బిడ్డ పరిస్థితి ఏమిటని వధువు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-08-17T06:28:09+05:30 IST