రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-11-18T23:55:51+05:30 IST

మండలంలోని గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి అశోక్‌కుమార్‌(18) మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

ఓబుళదేవరచెరువు, నవంబరు 18: మండలంలోని గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి అశోక్‌కుమార్‌(18) మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని మల్లెంమల్లోలపల్లికి చెందిన అశోక్‌కుమార్‌ స్థానిక విజ్ఞాన డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. తన క్లాస్‌మేట్‌ మహమ్మదాబాద్‌కు చెందిన ఈశ్వర్‌తో కలిసి ద్విచక్రవాహనంలో స్టడీ మెటీరియల్‌ కోసం ఓడీసీ నుంచి కదిరికి బయల్దేరాడు. ఈశ్వర్‌ బైక్‌ నడుపుతున్నాడు. గాజుకుంటపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని కదిరి నుంచి వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో అశోక్‌కుమార్‌, ఈశ్వర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రైవేటు వాహనంలో కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అశోక్‌కుమార్‌ మృతిచెందాడు. పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.

సొమ్మసిల్లిన తల్లిదండ్రులు

ఉమాదేవి, రామాంజులు దంపతులకు కుమారుడు అశోక్‌కుమార్‌, ఒక కూతురు ఉంది. కొడుకు మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని, బోరున విలపించారు. ‘బాగా చదువుకుని మంచిపేరు తెస్తావనుకుంటిమే.. ఇలా మమ్ములను వదిలి వెళ్లిపోతావనుకోలేదు నాయనా..’ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించి, సొమ్మసిల్లి పడిపోయారు.

Updated Date - 2022-11-18T23:55:53+05:30 IST