పత్తి రైతులకు పరిహారమివ్వాలి
ABN , First Publish Date - 2022-12-13T00:08:05+05:30 IST
కల్తీ, నాసిరకం పత్తి విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం, ఇన్సూరెన్స అందించాలని సీపీఎం, ఏపీ రైతు, కౌలురైతుసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
నాసిరకం విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
మంత్రి పెద్దిరెడ్డికి సీపీఎం, రైతుసంఘాల వినతి
అనంతపురం కల్చరల్, డిసెంబరు 12: కల్తీ, నాసిరకం పత్తి విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం, ఇన్సూరెన్స అందించాలని సీపీఎం, ఏపీ రైతు, కౌలురైతుసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్అండ్బీ అతిథిగృహంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ... ఈ ఏడాది ఖరీ్ఫలో జిల్లాలో దాదాపు 70వేల హెక్టార్లలో పత్తిపంట సాగు చేశారన్నారు. విత్తన కంపెనీలు నాసిరకం విత్తనాలను సరఫరా చేశారన్నారు. దీంతో తాడిపత్రి, పామిడి, పెద్దవడుగూరు, యాడికి, గుంతకల్లు, గుత్తి మండలాల్లో వేల ఎకరాల్లో పంట దిగుబడి రాలేదని తెలిపారు. పంట దిగుబడి రాకపోవడంపై రైతులు ఆందోళన చేస్తే నంద్యాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి దిగుబడి సక్రమంగా రాకపోవడానికి వాతావరణం, భూమిని కారణాలుగా చూపి కంపెనీలకు వత్తాసు పలకడం దారుణ మన్నారు. పంట నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయిన రైతులందరినీ 2007 సీడ్ యాక్ట్ ప్రకారం ఎకరాకు రూ.50వేలు పంటనష్టపరిహారం, ఇన్సూరెన్స ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది జరిగిన పంటల నష్టానికి మంజూరు చేసిన ఇన్సూరెన్స మొత్తంలో ఇప్పటికీ రూ.60కోట్లు జిల్లా రైతుల ఖాతాల్లో జమకాలేదని, వీటిని వెంటనే రైతు ఖాతాలకు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.