విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2022-09-09T05:12:57+05:30 IST
పట్టణంలోని గిర్రాజుకాలనీలో విద్యుదాఘాతానికి గురై భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు.
ధర్మవరం రూరల్, సెప్టెంబరు 8: పట్టణంలోని గిర్రాజుకాలనీలో విద్యుదాఘాతానికి గురై భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు. మండలంలోని బడన్నపల్లి గ్రామానికి చెందిన బేల్దారి యర్రగుంట ప్రతాప్రెడ్డి(43) గురువారం పట్టణంలోని గిర్రాజుకాలనీలో ఇంటిపైకప్పు నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత తీగలు తగిలి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు తోటికూలీలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. టూటౌన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చికిత్స పొందుతూ యువకుడు...
ధర్మవరంరూరల్, సెప్టెంబరు8: పట్టణంలోని దర్గ్గావీధికి చెందిన రమణ కుమారుడు పురుషోత్తం(18) కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. దర్గావీధికి చెందిన రమణ కుమారుడు పురుషోత్తం బెంగుళూరులో పనులు చేసుకునేవాడు. వినాయకచవితి పండుగకు ధర్మవరానికి వచ్చిన పురుషోత్తం మంగళవారం ధర్మవరం చెరువు మరవ వద్దకు వెళ్లాడు. అక్కడ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమచికిత్స నిమిత్తం అనంతరం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యచికిత్సలు నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.