అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-08-17T06:21:11+05:30 IST
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.
మొహర్రం వేడుకల్లో అపశృతి
చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 16: శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి అగ్నిగుండంలో పడి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కనుముక్కల గ్రామానికి చెందిన బిక్కా నరసింహుడు(66) కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. మొహర్రం వేడుకలలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి బసంపల్లికి వెళ్లాడు. అగ్నిగుండం చుట్టూ అలావ్ తొక్కుతూ.. ప్ర మాదవశాత్తు జారి అగ్నిగుండంలోపడ్డాడు. వెంటనే అక్కడున్నవారు నరసింహుడును బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ధర్మవరం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. నరసింహుడికి భార్య నరసమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు లక్ష్మణకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.