Anantapur: పాఠశాలల విలీనంపై రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2022-07-05T17:41:31+05:30 IST

పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు.

Anantapur: పాఠశాలల విలీనంపై రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు

అనంతపురం: పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలల విలీనం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఏవిధంగా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గం గలగల గ్రామ పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కణేకల్లు మండల కేంద్రంలో ఉన్న నేసేపేటలో ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు  వ్యతిరేకిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడుతున్నారు.


అటు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని మేళాపురంలో పాఠశాల గేటుకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి నిరసనకు దిగారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను బయటకు పంపి ఆందోళన చేపట్టారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముద్దిరెడ్డిపల్లి పాఠశాలలో విలీనం చేస్తే ఏవిధంగా వెళ్లాలంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-05T17:41:31+05:30 IST