ABN Effect: ‘బ్రతికుండగానే చంపేశారు’ కథనంపై కృష్ణా జిల్లా అధికారుల అప్రమత్తం
ABN , First Publish Date - 2022-09-08T17:12:38+05:30 IST
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఏబీఎన్ వెలుగులోకి తీసుకువచ్చిన బ్రతికుండగానే చంపేశారు కథనంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
విజయవాడ: కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఏబీఎన్ (ABN - Andhrajyothy) వెలుగులోకి తీసుకువచ్చిన ‘‘బ్రతికుండగానే చంపేశారు’’ కథనంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పింఛన్లు కోసం అర్జీ పెట్టుకొన్న 155 మంది చనిపోయినట్లుగా ప్రభుత్వ యాప్ (Government App)లో అధికారులు నమోదు చేశారు. అధికారుల నిర్వాకాన్ని సమాచార హక్కు చట్టం సాయంతో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ వరుస కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. కృష్ణా జిల్లాలో మరికొన్ని చోట్ల కూడా ఇదే విధంగా అర్జీదారుల పేర్లు డెత్ లిష్టులోకి చేరాయి. ఈ క్రమంలో ఏబీఎన్ కథనంతో అప్రమత్తమైన కృష్ణా కలెక్టర్ రంజిత్ భాషా.. ప్రభుత్వ ప్రతిష్ట మసక బారకుండా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విచారణ చేపట్టి అర్హులందరినీ ఎలిజిబుల్ లిస్టులో పెట్టినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఆయా లబ్దిదారులకు పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. తమ బాధలను వెలుగులోకి తీసుకువచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి పెన్షన్ అర్జీదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.