Secretariat Employeesసచివాలయ ఉద్యోగులకు షాక్
ABN , First Publish Date - 2022-12-09T03:22:36+05:30 IST
అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్ ఇస్తోంది.
హాజరుపై సర్కారు కొత్త మార్గదర్శకాలు
మధ్యాహ్నం 2 గంటలకు అటెండెన్స్ క్లోజ్
ఆయా శాఖల కార్యదర్శులకు వివరాలు
ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎస్
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్ ఇస్తోంది. రోజువారీ హాజరు విషయంలో కొందరు ఉద్యోగులు, అధికారులు సమయపాలన పాటించడం లేదని, పనివేళల్లో సచివాలయంలో ఉండటం లేదనే కారణాలతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతిశాఖలో ఓపీ సెక్షన్ ఇన్చార్జి (ఎంఎల్వో) రోజూ మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది హాజరును క్లోజ్ చేసి, ఆ వివరాలను ఆయా శాఖల కార్యదర్శులకు పంపాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉద్యోగుల హాజరు నిర్ధారణ బాధ్యత సంబంధిత శాఖ కార్యదర్శిపైనే ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగుల హాజరుపై ఇక నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొంది. ఈ ఆదేశాలను ప్రతి శాఖ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు తాజాగా సచివాలయంలోని అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం పనివేళల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ పెద్దలు గతంలో పలుమార్లు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాలప్పుడు మినహా సీఎంతో పాటు పలువురు మంత్రులు, కొందరు ఐఏఎస్ అధికారులు క్యాంప్ ఆఫీసులకు పరిమితమవుతున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడాన్ని ప్రభుత్వం సీరియ్సగా పరిగణించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.