మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-07-21T08:56:34+05:30 IST
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మేదరమెట్ల, జూలై 20: జాతీయరహదారిలో ఎమర్జెన్సీ రన్వేపై మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని మోటార్ సైకిలిస్టు మృతిచెందాడు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పీ.గుడిపాడు వద్ద హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వర్థినేనివారిపాలెంకు చెందిన బేల్దారి మేస్ర్తి గంగవరపు శ్రీను(50) ద్విచక్రవాహనంపై గుంటూరు వైపు వెళుతూ మధ్యలో పి.గుడిపాడు వైపు తిరిగాడు. అదే సమయంలో నెల్లూరు వైపు వెళ్తున్న మంత్రి గుడివాడ అమరనాథ్ కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీను ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో మృతుని సెల్ఫోన్ పూర్తిగా ధ్వంసం కాగా మేదరమెట్ల ఎస్ఐ శివకుమార్ ఆ సిమ్ను తీసి వేరే ఫోన్లో వేసి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు విజయవాడలో చదువుతుండగా, భార్య హైదరాబాద్లో ఉన్నట్లు తెలిసింది. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.