అప్పులబాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-17T10:08:47+05:30 IST
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు ఆదినారాయణ (41) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
బుక్కరాయసముద్రం, ఆగస్టు 16: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు ఆదినారాయణ (41) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదినారాయణ తన ఇంట్లో మగ్గాన్ని ఏర్పాటు చేసుకుని, చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. చేనేత ముడి సరుకులు, కుటుంబ అవసరాలకు దాదాపు రూ.5లక్షలు అప్పు చేశాడు. కొవిడ్ సమయంలో ఆశించిన స్థాయిలో గిరాకీలేక చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ క్రమంలో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు తన నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు ఎలా చేయాలో దిక్కుతోచక తీవ్ర మనస్తాపంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. భార్య రమాదేవి గమనించి, స్థానికుల సాయంతో కొన ఊపిరితో ఉన్న ఆదినారాయణను అనంతపురం సర్వజన అస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.