తక్కువ పెట్టుబడితో 50 కోట్ల ప్రాజెక్టు స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-17T09:09:27+05:30 IST

తక్కువ పెట్టుబడితో 50 కోట్ల ప్రాజెక్టు స్వాధీనం

తక్కువ పెట్టుబడితో 50 కోట్ల ప్రాజెక్టు స్వాధీనం

టెండర్లలో పాల్గొనకుండానే తీసేసుకున్నారు

అర్హతలు లేకున్నా అక్రమ లబ్ధి

వైవీ సుబ్బారెడ్డిపై సీబీఐ అభియోగం

ఆధారాలు లేవు: టీటీడీ చైర్మన్‌

తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తక్కువ పెట్టుబడి పెట్టి వసంత ప్రాజెక్ట్స్‌ కంపెనీ, నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు, ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కలిసి రూ.50 కోట్ల ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన ఇందూ- హౌసింగ్‌ బోర్డు ప్రాజెక్టు వ్యవహారంలో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టేయాలని 2016లో వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాది నాగేంద్రన్‌ వాదనలు వినిపిస్తూ.. అప్పటి సీఎం వైఎ్‌సను ప్రభావితం చేసి రూ.50 కోట్ల ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారని.. సుుబ్బారెడ్డి కేవలం రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి రూ.25 కోట్ల విలువైన 50 శాతం వాటాను దక్కించుకున్నారని పేర్కొన్నారు. 4.23 ఎకరాల గచ్చిబౌలి ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ హౌసింగ్‌ బోర్డు టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేరని.. ప్రాజెక్టు అవార్డు అయిన తర్వాత టెండర్‌ పొందిన సోమా, యూనిటీ కంపెనీలు వెళ్లిపోయాయని తెలిపారు. ఆ తర్వాత వసంత ప్రాజెక్ట్స్‌, వైవీ సుబ్బారెడ్డి ఒప్పందంలోకి ప్రవేశించారని.. ఆ విషయం ఏపీ హౌసింగ్‌ బోర్డుకు కూడా తెలియదని పేర్కొన్నారు. కేవలం అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ తనకు వర్తించనందున కేసు కొట్టేయాలని సుబ్బారెడ్డి అనడంలో అర్థం లేదన్నారు.  కోర్టు విచారణ సందర్భంగా 420, ఇతర సెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ప్రాజెక్టు టెండర్‌లో పేర్కొన్న అర్హతలు లేకుండా కుట్రపూరితంగా వైఎస్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా లబ్ధి పొందారని తెలిపారు. మూలనపడిన ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకున్నామని  సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. లబ్ధి పొందడం అనేది ప్రభుత్వ అధికారుల విషయంలో వర్తిస్తుందని.. తన క్లయింటుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని తెలిపారు. తొలుత నమోదు చేసిన కేసులో ఆయన పేరులేదన్నారు. కేవలం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడనే ఇరికించారని తెలిపారు. సీబీఐ చేసిన ఆరోపణలకు ఒక్కదానికి కూడా ఆధారాలు లేవన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2022-09-17T09:09:27+05:30 IST