మృతదేహానికి 5 వేలు

ABN , First Publish Date - 2022-08-10T09:35:47+05:30 IST

ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ వైద్యశాల వైద్యసిబ్బంది మృతదేహాలను సైతం వదలడంలేదు!.

మృతదేహానికి 5 వేలు

పోస్టుమార్టం చేసేందుకు డిమాండ్‌ చేసిన కంభం ఆస్పత్రి సిబ్బంది

బేస్తవారపేట(కంభం), ఆగస్టు 9: ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ వైద్యశాల వైద్యసిబ్బంది మృతదేహాలను సైతం వదలడంలేదు!. మనిషి పోయి బాధిత కుటుంబం విలవిలలాడుతుంటే వైద్యశాలలోని కొందరు మాత్రం వారిని పీక్కుతింటున్నారు. పోస్టుమార్టం కోసం పరికరాలు కొనుగోలు చేయాలంటూ డబ్బులు డిమాండ్‌ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అనంతపురం-అమరావతి హైవేలో  సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు పోస్టుమార్టం కోసం కంభం ఆస్పత్రికి తరలించగా, అక్కడి సిబ్బంది ఒక్కొక్క మృతదేహానికి రూ.5వేలు డిమాండ్‌ చేశారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా, అయితే.. పోస్టుమార్టం ఇప్పు డు కాదని, మధ్యాహ్నం తర్వాత చేస్తామని చెప్పారు.


గత్యంతరం లేక.. మృతుల బంధువులందరూ కలిసి.. రూ.10 వేలు ముట్టజెప్పారు. ఆ తర్వాతే సిబ్బంది పోస్టుమార్టం చేశారు. కాగా, మృతిచెందిన వారిలో ఒక మహిళ మెడలోని నల్లపూసల దండ కనిపించలేదని మృతుని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రికి తెచ్చిన సమయంలో మెడలో దండ ఉందని అంబులెన్స్‌ డ్రైవర్‌ చెబుతున్నారని, పోస్టుమార్టం తర్వాత లేదని అంటున్నారు. కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా మృతదేహాలకు సకాలంలోనే పోస్టుమార్టం చేశామన్నా రు. కాంట్రాక్ట్‌ సిబ్బంది కొందరు సిబ్బంది, మృతువుల బంధువులను వెంటపెట్టుకొని మృతదేహాలను ప్యాకింగ్‌ చేసే పరికరాల కోసం మార్కెట్‌కు వెళ్లి, రూ.10వేలతో ప్యాకింగ్‌ వస్తువులు కొని తెచ్చిన మాట వాస్తవమేనన్నారు. వారిద్దరికీ సంజాయిషీ నోటీసులిచ్చామన్నారు.

Updated Date - 2022-08-10T09:35:47+05:30 IST