25 మంది కరోనా మృతుల కుటుంబాలకు బీమా పరిహారం: కేంద్రం

ABN , First Publish Date - 2021-02-06T07:22:03+05:30 IST

తెలంగాణలో కరోనాతో మరణించిన ఆరుగురు డాక్టర్లు, ఆరుగురు నర్సులు, 13 మంది ఆరోగ్య వర్కర్లు మొత్తం 25

25 మంది కరోనా మృతుల కుటుంబాలకు బీమా పరిహారం: కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనాతో మరణించిన ఆరుగురు డాక్టర్లు, ఆరుగురు నర్సులు, 13 మంది ఆరోగ్య వర్కర్లు మొత్తం 25 మంది కుటుంబసభ్యులకు  ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ కింద ప్రకటించిన బీమా పథకం ప్రకారం పరిహారాన్ని అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే చెప్పారు.

లోక్‌సభలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి  సమాఽధానమిచ్చారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు రూ.353.13 కోట్లు విడుదల చేసినట్లు వైసీపీ ఎంపీలు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, రఘురామకృష్ణంరాజు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 



మాధ్యమిక స్థాయిలో బాలికల  సగటు డ్రాప్‌అవుట్‌ 17.3%

బాలికల సగటు డ్రాప్‌అవుట్‌ రేటు 2018-19లో మాధ్యమిక స్థాయిలో 17.2 శాతం, ప్రాథమిక స్థాయిలో 4.74 శాతం ఉన్నట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020లో బాల్యవివాహాలకు సంబంధించి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ 111 ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల వారీగా బాలికల సగటు డ్రాప్‌అవుట్‌ రేటును వివరించారు. 



అమలు కాని డిపాజిట్ల సేకరణ చట్టం

కేంద్రానికి ఎంపీ రఘురామ లేఖ

చట్టవ్యతిరేక డిపాజిట్ల సేకరణ చట్టాన్ని ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణవంటి రాష్ట్రాలు అమలు చేయడం లేదని, దాని వల్ల ఆయా సంస్థల్లో పెట్టుబడులుపెట్టి మోసపోయిన బాధితులు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌కు ఆయన లేఖ రాశారు.


అగ్రిగోల్డ్‌ సంస్థ కుంభకోణం ప్రభావం దాదాపు 45లక్షల మందిపై పడిందని తెలిపారు. ఆ సంస్థ ఆస్తులను అటాచ్‌ చేస్తుండడంవల్ల బాధితులకు ప్రయోజనం కలగడంలేదని పేర్కొన్నారు. ఆ సంస్థ భూములను పరిశ్రమలు, హౌసింగ్‌ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చన్నారు. టాటా, రిలయన్స్‌, ఆదాని, ఎయిర్‌టెల్‌, మహీంద్రఅండ్‌ మహీంద్ర  వంటి పెద్ద కంపెనీలకు ఆ భూములు ఉపయోగపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 



గిరిజన వర్సిటీ ఏర్పాటుకు చొరవ తీసుకోండి: గిరిజన శక్తి

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురికి గిరిజన శక్తి అధ్యక్షుడు వెంకటేశ్‌ చౌహాన్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. జనాభా దామాషా మేరకు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. 


Updated Date - 2021-02-06T07:22:03+05:30 IST