ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్‌ అక్కర్లేదు

ABN , First Publish Date - 2021-05-05T08:59:42+05:30 IST

కరోనా పరీక్షలకు జనం క్యూ కడుతుండటంతో టెస్టింగ్‌ ల్యాబ్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కీలక సిఫారసులతో ముందుకొచ్చింది...

ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్‌ అక్కర్లేదు

  • టెస్టింగ్‌ ల్యాబ్‌లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఐసీఎంఆర్‌ సిఫారసు

న్యూఢిల్లీ, మే 4 : కరోనా పరీక్షలకు జనం క్యూ కడుతుండటంతో టెస్టింగ్‌ ల్యాబ్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కీలక సిఫారసులతో ముందుకొచ్చింది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులు ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును చూపిస్తేనే లోపలికి అనుమతిస్తామని పలు రాష్ట్రాలు తేల్చిచెబుతున్నాయి. టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఒత్తిడిలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ నిబంధనను పూర్తిగా తొలగించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆరోగ్యవంతులైన వ్యక్తులకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేయకూడదని కోరింది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు లేదా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల్లో ఒకసారి పాజిటివ్‌ వచ్చిన వారికి మరోసారి ఆర్టీపీసీఆర్‌ చేయకూడదని పేర్కొంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేటప్పుడు కరోనా పరీక్ష చేయాల్సిన అవసరంలేదని తెలిపింది. అత్యవసర పనులు ఉంటేనే.. ప్రయాణించేలా, ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించేలా ప్రజలను చైతన్యపరిస్తే ఇన్ఫెక్షన్‌ తీవ్రత తగ్గుతుందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 


Updated Date - 2021-05-05T08:59:42+05:30 IST