ధరణికి మోక్షం ఎప్పుడు?
ABN , First Publish Date - 2021-10-19T05:38:56+05:30 IST
తెలంగాణలో పాలన చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా సాగుతోంది. ఏడు దశాబ్దాలకు పైగా రెవెన్యూ రికార్డులలోని మాయాజాలాన్ని సర్వే ద్వారా సరిచేయలేదు....
తెలంగాణలో పాలన చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా సాగుతోంది. ఏడు దశాబ్దాలకు పైగా రెవెన్యూ రికార్డులలోని మాయాజాలాన్ని సర్వే ద్వారా సరిచేయలేదు. ఆ శాఖలో అవినీతి చర్యలపై విచారణ జరిపి చర్యలు చేపట్టలేదు. గత ప్రభుత్వాలు ఆమోదించిన పట్టాదారు పాస్ పుస్తకాలు చెల్లవని ప్రకటించలేదు. ఇంకా 17 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వారందరికీ రైతుబంధు, పంటల బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ను ఆమోదించక నష్టం కలిగించారు. ఇక ప్రజలకు అవగాహన లేని ధరణి అంతర్జాలాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి పాలనను గందరగోళంలో పడవేసింది. ఇలాంటి ప్రయోగాలు రైతులపై చేయడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం వచ్చి ఏడు సంవత్సరాలయినా పరిష్కారం కాని ఈ సమస్యలు ఇంకా ఎప్పటికి తీరతాయి. పాలకులు అవగాహన పెంచుకుని రెవెన్యూశాఖకు అన్వయించే చట్టాలను సవరించాలి, లేదా కొత్త చట్టాలకు రూపకల్పన చేసి, పెండింగ్లో ఉంచిన 17 లక్షల ఎకరాలకు చెందిన పట్టాదార్ పాస్ పుస్తకాలను తక్షణం ఇవ్వాలి. ఈ పాస్ పుస్తకాలలో (ఆర్ఓఆర్ చట్టం) తప్పులుంటే సంబంధిత అధికారులను బాధ్యులను చేసి రైతులకు రక్షణ కల్పించాలి. తక్షణం సమగ్ర భూ సర్వే జరిపించి, అవినీతిని అరికట్టాలి.
డా. రావెళ్ల వెంకటరామారావు, ఖమ్మం