గాడిలోకి బీఎస్ఎన్ఎల్
ABN , First Publish Date - 2021-01-12T09:37:34+05:30 IST
ప్రభుత్వ రంగంలోని బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. ఈ రెండు సంస్థలు చాలా కాలం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో స్థూల లాభం నమోదు చేశాయి.
2020-21 ప్రథమార్థంలో స్థూల లాభం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. ఈ రెండు సంస్థలు చాలా కాలం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో స్థూల లాభం నమోదు చేశాయి. గత ఏడాది (2020)కి సంబంధించి టెలికాం శాఖ (డాట్) విడుదల చేసిన సమీక్ష నివేదిక ఈ విషయం పేర్కొంది. ఉద్యోగుల వీఆర్ఎస్ ఇందుకు బాగా పని చేసింది. ఈ పథకం కింద బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నుంచి గత ఏడాది జనవరి నెలాఖరుకు 92,956 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. దీంతో బీఎ్సఎన్ఎల్ నెలివారీ జీతాల ఖర్చు 50 శాతం (రూ.600 కోట్లు), ఎంటీఎన్ఎల్ నెలవారీ జీతాల ఖర్చు 75 శాతం (రూ.140 కోట్లు) తగ్గింది.
దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి ఆరు నెలల్లో ఈ రెండు సంస్థలు తొలి సారిగా స్థూల లాభాలు నమోదు చేశాయి.
4జీ సేవలు :
దేశవ్యాప్తంగా 4జీ సేవల కోసం బీఎ్సఎన్ఎల్ చేస్తున్న ప్రయత్నాలను డాట్ సమీక్ష వెల్లడించింది. ఇందుకోసం కంపెనీకి స్పెక్ట్రమ్తో పాటు నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకున్నట్టు వివరించింది. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు తీసుకున్న ఇతర చర్యలనూ తెలిపింది.
5జీకి సన్నాహాలు
దేశంలో ఐదో తరం (5జీ) టెలికాం సేవలకు జరుగుతున్న ప్రయత్నాలనూ డాట్ సమీక్ష వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే మద్రాస్ ఐఐటీ సహకారంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. దీనికి తోడు హైదరాబాద్లోని బ్యాంకింగ్ టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఐడీబీఆర్టీ)లో తొలి 5జీ యూజ్ కేస్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
ప్రధాన అంశాలు
అక్టోబరు నాటికి దేశంలో 117.17 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు
మొత్తం టెలిఫోన్ కనెక్షన్లలో 115.17 కోట్ల మొబైల్ ఫోన్ కనెక్షన్లు
దేశ భూభాగంలో 86.37 శాతానికి టెలికాం సేవలు
గ్రామీణ ప్రాంతాల్లో 58.85% ప్రాంతాలకే టెలికాం సేవలు.
77.64 కోట్లకు చేరిన ఇంటర్నెట్ ఖాతాదారులు
72.63 కోట్లకు చేరిన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు
రూ.10.55కు తగ్గిన ఒక జీబీ డేటా ధర