రేషన్ డీలర్లను జీసీసీలో విలీనం చేయాలి
ABN , First Publish Date - 2021-02-26T05:45:09+05:30 IST
మన్యంలో విధులు నిర్వహిస్తున్న రేషన్ డీలర్లను జీసీసీలో విలీనం చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర డిమాండ్ చేశారు.
పాడేరురూరల్, ఫిబ్రవరి 25: మన్యంలో విధులు నిర్వహిస్తున్న రేషన్ డీలర్లను జీసీసీలో విలీనం చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జీఎస్యూ భవనంలో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ 11 మండలాల్లో 400 మంది డీఆర్ డిపోల్లో రేషన్ డీలర్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి కేవలం కమిషన్ మాత్రమే ఇస్తున్నారన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియాన్ని ఎటువంటి కమిషన్ లేకుండా పంపిణీ చేశామన్నారు. రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఇంతకాలం పనిచేస్తున్న డీలర్లను గాలికి వదిలేయడం అన్యాయమన్నారు. రేషన్ డీలర్లకు రూ.18 వేలు చెల్లించాలని, రేషన్ డీలర్లను సేల్స్మేన్లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు సుమన్, కృష్ణారావు, రేషన్ డీలర్లు గెమ్మెలి లింగమూర్తి, కురుసా ఈశ్వరమ్మ, దన్నేటి పలాసి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.