పోలవరం సవరణ అంచనా ఆమోదించండి
ABN , First Publish Date - 2021-03-24T09:19:12+05:30 IST
పోలవరం సవరణ అంచనా ఆమోదించండి
రాజ్యసభలో విజయసాయిరెడ్డి వినతి
న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు సవరణ అంచనా రూ.55,656 కోట్లకు ఆమోదం తెలపాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి ద్రవ్యవినిమయబిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంగా ఈ సవరణ అంచనాల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా విశాఖలో రైల్వే జోన్ మంజూరైనా గత ఏడేళ్లుగా కార్యకలాపాలేవీ ప్రారంభించలేదని, తక్షణమే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు.
విశాఖలో నేషనల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజనులు ఆధారపడిన కాఫీపంటను ఉపాధి పథకం నుంచి తొలగించడం బాధాకరమన్నారు. హిందువుల పార్టీగా చెప్పుకొంటున్న బీజేపీ.. దేవాలయాలు, ట్రస్టులపై జీఎస్టీ భారం మోపడం శోచనీయమన్నారు. ప్రధానంగా టీటీడీ కాటేజీల అద్దెలపై కూడా జీఎస్టీ విఽధిస్తున్నారని, వీటిని హోటల్స్గా పరిగణించడం సరికాదని అన్నారు. టీటీడీ ఏటా రూ.120 కోట్ల జీఎస్టీ చెల్లిస్తోందని, దీనిలో కేవలం రూ.9 కోట్లే పరిహారంగా వస్తోందని తెలిపారు.