‘పుర’ంలో హైటెన్షన్!
ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST
నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల క్రతువు అటు పౌరులను, ఇటు రాజకీయ వర్గాలను ఉత్కంఠను రుచి చూపిస్తున్నాయి.
హైకోర్టులో విచారణ నేటికి వాయిదా!
నవంబరు 5కి వాయిదా పడ్డ మరో కేసు
నోటిఫికేషన్ మరింత జాప్యం?
నెల్లూరు (సిటీ), అక్టోబరు 25 : నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల క్రతువు అటు పౌరులను, ఇటు రాజకీయ వర్గాలను ఉత్కంఠను రుచి చూపిస్తున్నాయి. నగరంలో డివిజన్ల పునర్విభజన తంతు అశాస్త్రీయంగా జరిగిందని టీడీపీ నాయకులు 7909 కేసు నెంబరుతో హైకోర్టును ఆశ్రయించారు. ఇది విచారణ స్వీకరణకు దగ్గరలో ఉంది. తాజాగా నవంబరు 5వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగ ఓట్ల గల్లంతు, డివిజన్లకతీతంగా ఓట్ల జంప్ తదితర తప్పిదాలను వెలుగులోకి తెస్తూ టీడీపీ నాయకులు కొందరు 14,861 నెంబరుతో మరో కేసును హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు విచారణకు స్వీకరించే అవకాశాలు ఉన్నటు తెలుస్తోంది. ఇవిగాక అటు బీజేపీ, ఇటు సీపీఎంకు చెందిన నాయకులు కొందరు ఇవే అంశాలపై హైకోర్టును ఆశ్రయించారు. కాగా, కార్పొరేషన్ ఎన్నికలకు సోమవారం ఎస్ఈసీ నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుందని అంతా భావించారు. కానీ ఈ తంతు మరింత జాప్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పార్టీలు, మున్సిపల్ యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. బద్వేల్ ఉప ఉన్నిక అనంతరం నోటిఫికేషన్ రావచ్చన్న వాదన ఎక్కువుగా వినబడుతోంది. అయితే, అధికారులు మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.