కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-21T16:20:23+05:30 IST

కృష్ణపట్నం పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా..

కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభం

నెల్లూరు జిల్లా: కృష్ణపట్నం పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.


కాగా ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కొద్ది మందికి మాత్రమే మందు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ నివేదిక అనంతరం తేదీలని ప్రకటిస్తామని, అప్పటి వరకు పంపిణీని నిలిపేస్తామని చెప్పారు.


ఎవరీ ఆనంద్..!?

ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంకు చెందిన ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతోపాటు పలువురు మేధావుల దగ్గర సలహాలు కూడా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు.


బ్రహ్మాస్త్రం!

‘‘కృష్ణపట్నం కరోనా మందు..’’ కొవిడ్‌ రోగుల పాలిట దివ్వఔషధం! కరోనా రాని వారికి కూడా వైరస్‌ సోకుకుండా అడ్డుకునే బ్రహ్మాస్త్రం! కరోనా సెకండ్‌వేవ్‌ కుదిపేస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ! ఈ మందుపై చాలా మందిలో ఏదో తెలియని ఆశ. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా దుర్లభంగా మారింది. ఆక్సిజన్‌ అందక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కృష్ణపట్నం కరోనా మందుని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. 


వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం

కృష్ణపట్నంలో కరోనా మందు తయారీదారుడి పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడది రోజుకు 4-5వేలకు చేరింది.


ఐదు రకాల మందులు తయారీ.. 

1 ఊపిరితిత్తుల కోసం : ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారు, లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమై శక్తిపుంజుకుంటాయి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌దంగి (ఆడ, మగ) ఐదు వంతులు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగి చెక్క, అన్నింటినీ కలిపి పొడిచేసి తేనెలో నాలుగు గంటలపాటు ఉడికించాలి. పాజిటివ్‌ రోగులకు దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఇవ్వాలి. కరోనా సోకని వారు ఒక్క రోజు వాడితే చాలు. 


2.పాజిటివ్‌ రోగులకోసం : పుప్పింట ఆకు, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె మిక్సీలో వేసి పొడిచేయాలి. దాన్ని తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. దీన్ని కరోనా రోగులకు భోజనంతోపాటు ఒకసారి చొప్పున రెండు రోజులు ఇవ్వాలి. 


3.పాజిటివ్‌ రోగులకోసం : నేల ఉసిరి, గుంటగరగరాకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె కలిపి పొడి చేసి 4 గంటల పాటు తేనెలో ఉడికించాలి. పాజిటివ్‌ రోగులకు పైన తెలిపిన రెండు మందులను ఇచ్చిన నాలుగు గంటల తరువాత ఒకసారి చొప్పున రెండు రోజులు ఇవ్వాలి. 


4. పాజిటివ్‌ రోగులకోసం : పెద్దపల్లేరు కాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె అన్నీ కలిపి పొడిచేసిన మిశ్రమాన్ని తేనెలో 4 గంటు ఉడికించాలి. రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు వాడాలి. 


5. పాజిటివ్‌ రోగులకోసం : ఒక కేజీ తేనె, 100 గ్రాముల తోక మిరియాలు, చారెడు ముళ్ల వంకాయ గుజ్జు. తయారీ విధానం. తేనె వేడి చేసి అందులో తోక మిరియాలు, ముళ్ల వంకాయ గుజ్జు వేయాలి. ఈ ద్రావణాన్ని ఆక్సిజన్‌ స్థాయినిబట్టి ఒక్కో కంటిలో ఒక్కో డ్రాప్‌ చొప్పున వేయాలి.  

Updated Date - 2021-05-21T16:20:23+05:30 IST